Turkey Earthquake | భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన తుర్కియే(Turkey), సిరియా (Syria) దేశాలను ఆదుకునేందుకు భారత్ (India) ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ దోస్త్’ (Operation Dost) పేరుతో భారత్ సహాయక చర్యల్లో పాల్గొనింది. సహాయక కార్యక్రమాల్లోఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ పాలుపంచుకున్నాయి. కాగా, ఆపదలో ఉన్న తమ దేశానికి అండా నిలిచిన భారత్కు తుర్కియే కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు భారత్లోని తుర్కియే అంబాసిడర్ (Turkey Ambassador) ఫిరాత్ సునేల్ (Firat Sunel ) ట్వీట్ చేశారు.
‘భారత ప్రభుత్వం మాదిరే.. విశాల హృదయం ఉన్న భారతీయ ప్రజలు కూడా భూకంప ప్రాంతంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి చేతులు కలిపారు. మీ విలువైన సహాయానికి మేము నిజంగా అందరినీ అభినందిస్తున్నాము’ అంటూ సునేల్ ట్వీట్లో పేర్కొన్నారు. భారత్ నుంచి తుర్కియేకి తరలించిన టన్నుల కొద్దీ సామగ్రికి సంబంధించిన వీడియోను ట్వీట్కు జతచేశారు.
కాగా, తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపంలో ఇప్పటి వరకు 46వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. పలు దేశాలకు చెందిన సహాయక బృందాలు రంగంలోకి భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు రక్షించే ప్రయత్నం చేశారు.
పారా ఫీల్డ్ హాస్పిటల్ ద్వారా తుర్కియేలో సుమారు 4వేల మందికి చికిత్స అందించినట్లు ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ తెలిపింది. ఆపరేషన్ దోస్త్కు వెళ్లిన ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ స్వదేశానికి తిరిగి వచ్చింది. ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్లో ఇవాళ మెడికల్ బృందంతో విమానం ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదర్శ శర్మ మాట్లాడుతూ.. తుర్కియేకు హుటాహుటిన దళాన్ని పంపించినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ తెలిపారు. కేవలం కొన్ని గంటల్లోనే ఫీల్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 4వేల మంది పేషెంట్లకు చికిత్స అందించామని, దాంట్లో మేజర్, మైనర్ సర్జరీ కేసులున్నాయన్నారు. సరైన సమయంలో సరైన చికిత్సను అందించామని, ఆ లక్ష్యాన్ని తాము అందుకున్నట్లు కల్నల్ ఆదర్శ్ శర్మ తెలిపారు.