ముంబై: యువ నటి తునీషా శర్మ మృతి కేసులో ఆమె సహ నటుడు షీజాన్ ఖాన్ను పోలీసులు ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ముంబైలోని వాసాయ్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతనికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
నిన్న (శనివారం) ఓ టీవీ సీరియల్ షూటింగ్ సెట్లో తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్ గ్యాప్లో టాయిలెట్స్కు అని వెళ్లిన తునీషా శర్మ ఎంతకూ బయటికి రాకపోవడంతో సీరియల్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా.. తునీషా మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది.
దాంతో పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తునీషా, ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని తేలింది. 15 రోజుల క్రితమే షీజాన్ ఖాన్ ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలిసింది. బ్రేకప్ జరిగినప్పటి నుంచి తునీషా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైందని, దాంతోనే చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు.
తునీషా ఆత్మహత్య చేసుకునేలా షీజాన్ ఖాన్ ప్రేరేపించినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చి కస్టడీ కోరారు. కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో షీజాన్ ఖాన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు.