Justin Trudeau | ఒట్టావా/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తిరిగి అవే ఆరోపణలు చేశారు. ఆరోపణల విషయంలో భారత్ తీవ్రంగా స్పందించినప్పటికీ, నిజ్జర్ను భారత్ ఏజెంట్లే హత్య చేశారని మళ్లీ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలను తాను కొన్ని వారాల క్రితమే భారత్తో పంచుకొన్నానని తాజాగా చెప్పుకొచ్చారు. శనివారం మీడియా సమావేశంలో జస్టిస్ ట్రూడో మాట్లాడుతూ దీనిపై లోతుగా విచారణ జరిపేందుకు భారత్ సహకరిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
గురుపత్వంత్కు ఎన్ఐఏ షాక్
భారతీయ హిందువులు వెళ్లిపోండి అంటూ హెచ్చరించిన ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) హెడ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్కు ఎన్ఐఏ గట్టి షాక్ ఇచ్చింది. భారత్లోని ఆయన ఆస్తులను శనివారం స్వాధీనం చేసుకొన్నది.
కెనడాలో నిజ్జర్ ఉగ్ర శిబిరాలు
కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ ఆ దేశంలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహించేవాడని, భారత్లో దాడులకు నిధులు సమకూర్చేవాడని భారత నిఘా వర్గాల పత్రాలు పేర్కొన్నాయి. నిజ్జర్కు పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని, ఆ దేశంలోనే శిక్షణ తీసుకొన్నాడని, ఇందుకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సహకరించిందని, పంజాబ్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడని ఆ పత్రాలు తెలిపాయని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నిజ్జర్ హత్య తర్వాత కెనడా జాతీయ భద్రతా సలహాదారు జోదీ థామస్ భారత్లో ఆగస్టులో రెండుసార్లు పర్యటించారని, భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఇతర నిఘా అధికారులతో సమావేశమైనట్టు సంబంధిత వర్గాలు వెల్లడించినట్టు తెలిసింది.
అమెరికాకు భారతే ముఖ్యం…
అమెరికా..భారత్ వైపే ఉంటుందని, భారత్ వ్యూహాత్మకంగా అమెరికాకు ముఖ్యమైన దేశమని అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖెల్ రుబిన్ అన్నారు.
నాడు తండ్రి.. నేడు తనయుడు
గతంలో జస్టిన్ ట్రూడో తండ్రి పియర్ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు 1970, 80వ దశాబ్దాల్లోనూ ఇంత కంటే ఎక్కువ ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. పియర్ ట్రూడో హయాంలోనూ ఖలిస్థానీ అంశంతో పాటు పోఖ్రాణ్ అణు పరీక్షలు, ఉగ్రవాది తల్వీందర్ సింగ్ పర్మార్ అప్పగింత తదితర సందర్భాల్లో పియర్ భారత్తో కయ్యానికి కాలు దువ్వారు. భారత అభ్యర్థనలను, హెచ్చరికలను పట్టించుకోకుండా.. ఖలిస్థానీలకు వంతపాడారు. 1985, జూన్ 23న కెనడాలోని టోరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిరిండియా విమానం ‘కనిష్క’ను ఖలిస్థాన్ ఉగ్రవాదులు సూట్కేసు బాంబులతో పేల్చేశారు. కెనడాలో తలదాచుకొంటున్న ఉగ్రవాది, బబ్బర్ ఖల్సా సభ్యుడు తల్వీందర్ సింగ్ పర్మార్ దీనికి ప్రధాన సూత్రధారి. అతడిని అప్పగించాలన్న భారత అభ్యర్థనను నాటి కెనడా ప్రధాని పియర్ ట్రూడో తోసిపుచ్చారు. మరోవైపు అమెరికా, కెనడా భాగస్వామ్యంతో భారత్ అణు ఇంధన కార్యక్రమాలు మొదలుపెట్టింది. అయినప్పటికీ, 1974లో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించడంపై పియర్ ట్రూడో ఆగ్రహం వ్యక్తం చేశారు.