కోల్కతా: టీఎంసీ ఎమ్మెల్యే(TMC MLA) దిలీప్ మోండల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బిష్ణుపుర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే గెలిచిన తర్వాత ఆయన బీజేపీ కార్యకర్తలను బెదిరించారు. దీంతో ఆయనపై కేసు బుక్ చేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే దిలీప్ మోండల్ పరారీలో ఉన్నారు. అయితే ఇవాళ ఆ ఎమ్మెల్యే కుమారుడు అర్ఘ్య మోండల్ను పోలీసులు కోల్కతాలో అరెస్టు చేశారు. ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో అయిదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. బక్కహల్లి-ఫ్రేసర్గంజ్ లో వారిని పట్టుకున్నారు.
అర్ఘ్య మోండల్ నుంచి రెండు పిస్తోళ్లు, ఆరు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితుల్ని డైమండ్ హార్బర్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆర్ఘ్య మోండల్ కూడా బీజేపీ వర్కర్లు, మద్దతుదారుల్ని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే దిలీప్ మోండల్ కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలిస్తున్నారు. ఆయనకు ఉన్న రెండు ఇండ్లల్లో ఇప్పటికే సోదాలు చేపట్టారు. మతఘర్షణలను రెచ్చగొట్టే రీతిలో ఎమ్మెల్యే దిలీప్ ప్రసంగించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.