టొరంటో : కరోనా వైరస్ స్వల్ప, మధ్యస్ధ లక్షణాలతో బాధపడుతూ దవాఖానలో చేరిన రోగులకు రక్తం పలుచన చేసే (బ్లడ్థిన్నర్స్) మందులను పూర్తి డోస్లో ఇవ్వడంతో బ్లడ్ కాట్స్ను నివారించి వైరస్ మరణాలను తగ్గించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా రోగుల్లో వైరస్ లోడ్ పెరిగి ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో వాపు, రక్తం గడ్డకట్టడంతో వ్యాధి తీవ్రత పెరగడం మరణాలకు దారితీస్తున్న క్రమంలో బ్లడ్థిన్నర్స్ చికిత్సతో వీటిని నియంత్రించవచ్చని అధ్యయనం పేర్కొంది.
కెనడాలోని సెయింట్ మైఖేల్ ఆస్పత్రి, అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆదఫ్ వెర్మంట్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఆస్పత్రుల్లో చేరిన రోగులకు వీరు బ్లడ్థిన్నర్ హెర్పరిన్ను రోజూ తక్కువ డోస్లో ఇవ్వడంతో ఆయా రోగుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం నివారించినట్టు వెల్లడైంది. రోగుల శరీరంలో వాపు ప్రక్రియనూ బ్లడ్థిన్నర్ నివారించినట్టు పరిశోదకులు గుర్తించారు.
హెర్పరిన్ చికిత్సతో కొవిడ్-19 రోగుల్లో ఏ కారణం చేతనైనా మరణాలను 78 శాతం వరకూ తగ్గించినట్టు వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మేరీ కుష్మన్ తెలిపారు. ఇక స్వల్ప మధ్యస్థ లక్షణాలతో బాధపడే కొవిడ్-19 రోగులకే బ్లడ్థిన్నర్స్తో చికిత్స మెరుగైన ఫలితాలు రాబట్టిందని, ఇది ఐసీయూలో ఉన్న రోగులపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.