చంఢీఘడ్: ఈ యేటి మిస్ యూనివర్స్గా భారతీయ సుందరి హర్నాజ్ సంధూ కిరీటాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే విశ్వసుందరి పోటీల్లో హర్నాజ్ వేసుకున్న గౌన్ ఓ స్పెషల్ అట్రాక్షన్. ఇక ఆ గౌన్ను డిజైన్ చేసింది ఎవరో తెలిస్తే షాక్ కావాల్సిందే. ట్రాన్స్వుమెన్గా మారిన సైషా సిండే ఆ గౌన్ను డిజైన్ చేసింది. మిస్ యూనివర్స్ పోటీ ఫైనల్లో సంధూ.. సిల్వర్ గౌన్లో ధగధగలాడింది. బీడింగ్లు ఉన్న ఆ గౌన్లో సంధూ వేదికపై చమక్కుమంది. ఇక ఆ డ్రెస్సును డిజైన్ చేసిన ట్రాన్స్వుమెన్ సైషా షిండే మాత్రం ఆనందంలో తేలిపోతోంది. హర్నాజ్ ఫోటోను కూడా షిండే తన ఇన్స్టాలో షేర్ చేసింది.
నిజానికి సైషా సిండే అసలు పేరు స్నాప్నిల్ షిండే. ఈ ఏడాది జనవరి నుంచి ఈమె ట్రాన్స్వుమెన్గా మారింది. 20 ఏళ్ల ప్రాయంలో తాను గే అని సైషా గ్రహించింది. అవమానాలు భరించలేక.. తాను ట్రాన్స్వుమెన్గా మారినట్లు డిజైనర్ సైషా చెప్పింది. అంతర్జాతీయ అందాల పోటీల్లో మిస్ ఇండియా నుంచి చాలా అంచనాలు ఉంటాయని, చాలా ఆకర్షణీయంగా మోడల్ కనిపించే రీతిలో దుస్తుల్ని డిజైన్ చేయాల్సి ఉంటుందని సైషా చెప్పింది. మిస్ యూనివర్స్ వయసు 21 ఏళ్లు కాగా, డిజైనర్ సైషా షిండే వయసు 40 ఏళ్లు. ఎంబ్రాయిడరీ, స్టోన్స్, సీక్వెన్లతో గౌన్ను డిజైన్ చేసినట్లు సైషా తెలిపింది. పంజాబీ ఆనవాళ్లు కనిపించే రీతిలో పుల్కారీ ప్యాటర్న్తో గౌన్ను డిజైన్ చేసినట్లు ఆమె చెప్పింది.
ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, దీపికా పదుకునే, తాప్సీ పన్నూ, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్, మధూరి దీక్షిత్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలకు సైషా షిండే దుస్తుల్ని డిజైన్ చేస్తోంది.