న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకోసం ఏర్పాటైన కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, హేతుబద్ధత, సామాజిక వైవిధ్యం లోపించిందని, దీనిని మెరుగుపర్చాలని విభిన్న వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర సర్కారు రాజ్యసభలో వెల్లడించింది. గురువారం రాజ్యసభలో న్యాయశాఖమంత్రి కిరెన్ రిజిజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఉన్నత న్యాయస్థానాల జడ్జీల నియామకాలు, బదిలీలకు సంబంధించిన విధివిధాన పత్రానికి సవరణలు సూచించినట్టు ఆయన చెప్పారు. జడ్జీల నియమాకాలను మరింత విశాల ప్రాతిపదికన, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 2015లో 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల చట్టాన్ని తెచ్చిందని మంత్రి చెప్పారు. అయితే అవి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. మునుపటి కొలీజియం వ్యవస్థే చెల్లుబాటు అవుతుందని చెప్పిందని వివరించారు. అయితే కొలీజియం వ్యవస్థను సంస్కరించడంపై అప్పుడప్పుడు విజ్ఞాపనలు అందుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.