ఆగ్రా : పర్యాటకులకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఈ నెల 19న శుక్రవారం తాజ్ మహల్ చూసేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయడం లేదని తెలిపింది. ‘వరల్డ్ హెరిటేజ్ వీక్’ను పురస్కరించుకొని ఆగ్రాకోట, ఫతేపూర్ సిక్రీ, సికంద్రాలోని అక్బర్ సమాధి, ఇత్మాద్ ఉద్ దౌలాతో పాటు దేశవ్యాప్తంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న చారిత్రక కట్టడాల వద్ద ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు పేర్కొంది.
అయితే, మామూలు సందర్భాల్లో శుక్రవారం తాజ్మహల్ను చూసేందుకు అవకాశం ఉండదు. ప్రతి శుక్రవారం మూసే ఉంటుంది. మరో వైపు రేపు పౌర్ణమి కావడంతో పున్నమి వెన్నెల్లో తాజ్మహల్ కనువిందు చేయనున్నది. యూనెస్కో నవంబర్ 19-25 మధ్య నిర్వహించే ‘వరల్డ్ హెరిటేజ్ వీక్’ను పురస్కరించుకొని ఎంట్రీ ఫీజును మినహాయిస్తున్నట్లు ఏఐఎస్ అధికారి తెలిపారు.
న్యూఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఆదేశాల మేరకు విదేశీ పర్యాటకులతో సహా అందరికీ ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆర్కియాలజీ అధికారి తెలిపారు. పర్యాటకులకు వారి సుసంపన్నమైన వారసత్వంపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల లక్ష్యమని పేర్కొన్నారు. వారం పాటు స్మారక కట్టడాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.