న్యూఢిల్లీ, జనవరి 30: ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాలను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు ప్రజాప్రయోజన పిటిషన్లు దాఖలయ్యాయి. సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్, ప్రముఖ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఎంఎల్ శర్మ, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. బీబీసీ డాక్యుమెంటరీని చూసినవారిని ప్రభుత్వం అరెస్టు చేస్తున్నదని, ఈ నేపథ్యంలో తమ పిల్స్ను అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీయూ సింగ్ సోమవారం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. 2002 గుజరాత్ అల్లర్లపై వచ్చిన నివేదికలు, వార్తలు, వాస్తవాలను చూసే హక్కు పౌరులకు ఉన్నదా? లేదా? అనే విషయాన్ని సుప్రీంకోర్టు నిర్ణయించాలని ఎంఎల్ శర్మ కోరారు. సామాజిక మాధ్యమాల్లో బీబీసీ డాక్యుమెంటరీ లింకులను వెంటనే నిలిపివేయాలంటూ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
బెంగళూరులో డాక్యుమెంటరీ ప్రదర్శన
బీబీసీ డాక్యుమెంటరీ బెంగళూరులో ప్రదర్శితమైంది. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ శనివారం తమ కార్యాలయంలో ప్రదర్శించింది. దాదాపు 40 మంది విద్యార్థులు ఆ డాక్యుమెంటరీని తిలకించి చర్చలో పాల్గొన్నట్టు ఏఐఎస్ఏ వెల్లడించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, క్రైస్ట్ కాలేజీ, సెయింట్ జోసఫ్ కాలేజీ తదితర సంస్థల విద్యార్థులతోపాటు ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. కాగా, ఈ వ్యవహారంలో చర్యలు చేపట్టాల్సింది పోలీసులేనని కర్ణాటకలోని అధికార బీజేపీ పేర్కొన్నది. రాష్ట్రంలోని ఏ పాఠశాలలో లేదా కళాశాలలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శితమవనందున చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదని కర్ణాటక విద్యాశాఖ తెలిపింది.
కోర్టు సమయాన్ని వృథా చేయడమే: రిజిజు
బీబీసీ డాక్యుమెంటరీపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేయడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. దేశంలో వేలమంది సామాన్య ప్రజలు కేసుల సత్వర విచారణ కోసం, తీర్పుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇలాంటి పిటిషన్లు వేయడం ఎంతో విలువైన సుప్రీంకోర్టు సమయాన్ని వృథా చేయడమేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారతకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించిందని కేంద్ర సమాచార, ప్రసార, విదేశీ వ్యవహారాల శాఖలు ఆరోపించాయి. భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేలా బీబీసీ దుష్ప్రచారం చేస్తున్నదని పేర్కొన్నాయి.