న్యూఢిల్లీ, జూలై 6: మోటర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం అధునాతన యాడ్-ఆన్లు జారీ చేయడానికి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ యాడ్-ఆన్లు టెలీమాటిక్స్ ఆధారిత మోటర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. వీటి ప్రీమియంలు వాహన వినియోగం, డ్రైవింగ్ తీరుపై ఆధారపడి ఉంటాయి. ‘మోటర్ ఇన్సూరెన్స్ విధానంలో నిరంతరం మార్పులుంటాయి. పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్త మార్పులను అందిపుచ్చుకోవాలి’ అని ఐఆర్డీఏఐ తెలిపింది.
మోటర్ ఓన్ డ్యామేజీ కవరేజ్ కోసం ఈ యాడ్-ఆన్లను జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు విక్రయించేందుకు ఐఆర్డీఏఐ గ్రీన్సిగ్నల్ ఇవ్వగా.. ‘పే యాజ్ యూ డ్రైవ్’, ‘పే హౌ యూ డ్రైవ్’ ఆధారంగా ఈ ప్లాన్ల ప్రీమియంలు ఉన్నాయి. ‘పే యాజ్ యూ డ్రైవ్’ అనేది ఓ సమగ్ర మోటర్ ప్లాన్. ఇందులో వాహన వినియోగం ఆధారంగా ప్రీమియం ఉంటుంది. ఇక ‘పే హౌ యూ డ్రైవ్’ ప్రీమియం వాహనదారుల డ్రైవింగ్ తీరుపై ఆధారపడి ఉంటుంది.
టూవీలర్లు, ప్రైవేట్ కార్ల యజమానుల కోసం ఫ్లోటర్ పాలసీకి కూడా ఐఆర్డీఏఐ అనుమతి ఇచ్చింది. తాజా నిర్ణయాలు బీమా కొనుగోలుదారులను పెంచగలవన్న విశ్వాసాన్ని ఐఆర్డీఏఐ వ్యక్తం చేసింది. మోటర్ ఓన్ డ్యామేజీ కవరేజ్ ఎంత బలంగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడింది. పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామని ఐఆర్డీఏఐ వివరించింది.
ఇప్పటికే బీమా తీసుకున్న పాలసీదారులకు అదనపు పాలసీ కవరేజీ సౌకర్యం ఈ యాడ్-ఆన్లతో లభిస్తుంది. అయితే ఇందుకోసం కొద్దిమొత్తంలో అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వాహన డ్యామేజీ ఖర్చుల భారాన్ని కస్టమర్లు తప్పించుకోవచ్చు. యాడ్-ఆన్ల ద్వారా రోడ్డుపై వాహనం మొరాయించినప్పుడు సహాయం, ఇతర ప్రధాన విడిభాగాల రీప్లేస్మెంట్, రిటర్న్ టు ఇన్వాయిస్ మొదలైన సేవల్ని పొందవచ్చు.