లక్నో: ప్రియురాలిని ఆకట్టుకునేందుకు, ఆమె కోరికలు తీర్చేందుకు ఒక వ్యక్తి గ్యాంగ్ను ఏర్పాటు చేసి దోపిడీలకు (UP man robberies) పాల్పడ్డాడు. ఇటీవల రూ.60 లక్షలను ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల చెవిలో పడింది. దీంతో ఆ జంటతోపాటు గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల పరాస్ తివారీకి 24 ఏళ్ల మహిమా సింగ్ అనే ప్రియురాలు ఉంది. ఆమె కోరికలు తీర్చేందుకు ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. వారు చోరీలు, దోపిడీలకు పాల్పడేవారు. శివారు ప్రాంతాల్లోని ఖరీదైన ఇళ్లు, నగల షాపులను టార్గెట్ చేసేవారు. దోచుకున్న నగలు, డబ్బులను మహిమా సింగ్కు ఇచ్చేవారు. పంచుకున్న వెండి, బంగారు ఆభరణాలను జ్యుయలరీ షాపులో అమ్మేవారు.
కాగా, పరాస్ తివారీ తన ముఠాతో కలిసి ఇటీవల భారీ దోపిడీలకు పాల్పడ్డాడు. దీంతో దోచుకున్న సొత్తు నుంచి ఏకంగా రూ.60 లక్షలను ప్రియురాలు మహిమకు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో దోపిడీ కేసులపై దృష్టిసారించారు. కొత్వాలి పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక గుడి సమీపంలో ఉన్న ఈ ముఠాను అరెస్టు చేశారు. రూ.9 లక్షల నగదు, రూ.8 లక్షల విలువైన చోరీ చేసిన నగలు, రెండు అక్రమ ఆయుధాలు, ఒక కత్తి, మూడు బుల్లెట్లును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ముఠా నాయకుడు పరాస్ తివారీ, అతడి ప్రియురాలు మహిమా సింగ్తోపాటు ముఠా సభ్యులైన 23 ఏళ్ల అమిత్ సోని, 20 ఏళ్ల రాజా, 21 ఏళ్ల జ్ఞానేశ్వర్ గుప్తా, 33 ఏళ్ల దేవేంద్ర వర్మ సోనార్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్ కోసం జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.