పనాజీ: దివ్యాంగురాలైన కుమార్తెకు ఆహారం తినిపించేందుకు కూలీ పనులు చేసుకునే ఒక వ్యక్తి సొంతంగా రోబో తయారు చేశాడు. ఎలాంటి శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయినా ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుసుకుని రోబోను అభివృద్ధి చేశాడు. దాని ద్వారా కుమార్తెకు ఆహారం తినిపిస్తున్నాడు. పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన కుమార్తె కళ్లల్లో ఆనందం చూసి పరవసించిపోతున్నాడు. గోవాలోని పోండా తాలూకాలో ఈ సంఘటన జరిగింది. బేథోరా గ్రామానికి చెందిన 40 ఏళ్ల బిపిన్ కదమ్ రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి 14 ఏళ్ల కుమార్తె దివ్యాంగురాలు. శరీరంలో కదలిక లేని ఆమె సొంతంగా చేతులతో తినలేదు. దీంతో పూర్తిగా తల్లిపై ఆ బాలిక ఆధారపడింది.
కాగా, రెండేళ్ల కిందట కదమ్ భార్య అనారోగ్యం వల్ల మంచానికే పరిమితమైంది. దీంతో దివ్యాంగురాలైన కుమార్తెకు అన్నం తినిపించలేక బాధపడసాగింది. కదమ్ పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుమార్తెకు ఆహారం పెట్టేవాడు. అయితే కుమార్తెకు ఆహారం పెట్టలేకపోతున్న భార్య బాధను అతడు భరించలేకపోయాడు. దీని కోసం ఏదో ఒకటి చేయాలని భార్య చెప్పడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన కుమార్తె ఎవరిపై ఆధారపడకుండా ఆమెకు ఆహారం తినిపించే రోబో కోసం అన్వేషించాడు. అయితే ఎక్కడా కూడా అలాంటి రోబో లేదని తెలుసుకున్నాడు. దీంతో తానే సొంతంగా తయారు చేయాలని అతడు సంకల్పించాడు.
రోబో తయారు చేసేందుకు కదమ్ ఎంతో కష్టపడ్డాడు. రోజూ 12 గంటలపాటు కూలీ పనులు చేసేశాడు. అనంతరం మిగతా సమయాన్ని రోబో తయారుకు వినియోగించాడు. నాలుగు నెలలపాటు ఆన్లైన్ ద్వారా రోబో తయారీ విధానం, దాని సాంకేతిక గురించి తెలుసుకున్నాడు. చివరకు వాయిస్ కమాండ్ ద్వారా ఆహారం తినిపించే ‘మా రోబోట్’ను తయారు చేశాడు. ఈ రోబో ముందున్న ప్లేట్లలోని ఆహారాన్ని అది తినిపిస్తుంది. వాయిస్ కమాండ్ ద్వారా ఏ ఆహారం కావాలో అన్నది చెబితే ఆ అన్నం, కూర కలపడం, తినిపించడం చేస్తుంది.
మరోవైపు కదమ్ తయారు చేసిన ఆహారం తినిపించే రోబో గురించి తెలుసుకున్న గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అతడి ఆవిష్కరణను అభినందించింది. ఆ రోబోను మరింతగా అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా తయారు చేసేందుకు అతడికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నది. దివ్యాంగులైన కదమ్ కుమార్తె వంటి వారెందరికో ‘తల్లి రోబో’ ఉపయోగపడుతుందని ఆ సంస్థకు చెందిన ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదీప్ ఫల్దేశాయ్ తెలిపారు. మార్కెట్లోకి విడుదల చేయబోయే రోబో ధర ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు.