న్యూఢిల్లీ: అలనాటి నటి, నర్తకి అయిన సుధాచంద్రన్కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) క్షమాపణ చెప్పింది. ఇటీవల సుధాచంద్రన్కు ఎయిర్పోర్టులో అవమానం జరిగింది. సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారిణి.. నటి సుధాచంద్రన్ను కృత్రిమ కాలును తీసి చూపించమని అడిగింది. ఈ ఘటనపై మనస్తాపం చెందిన సుధాచంద్రన్ ప్రధానిని ప్రశ్నిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
‘గుడ్ ఈవినింగ్ ప్రధాని మోదీగారు నేను మీకొక పర్సనల్ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది కేంద్ర ప్రభుత్వానికి నా అభ్యర్థన. నా పేరు సుధాచంద్రన్. వృత్తిరీత్యా నటిని, డ్యాన్సర్ను. కృత్రిమ కాలుతో నృత్యాలు చేసి చరిత్ర సృష్టించాను. నా దేశం గర్వపడేలా చేశాను. నేను నా ఈవెంట్ల కోసం ఎక్కడి వెళ్లినా ఎయిర్పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది నా కృత్రిమ కాలును తీసి చూపించాలనడం పరిపాటిగా మారింది. ఇది మానవీయమేనా మోదీ గారు..? దేశం ఎక్కడికి వెళ్తున్నది..? మన దేశంలో ఒక మహిళ సాటి మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా..?’ అని వీడియోలో ప్రశ్నించారు. మోదీగారు దయచేసి సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ అని తెలిపే కార్డులను ఇప్పించండని కోరారు.
ఈ వీడియోపై సీఐఎస్ఎఫ్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. సుధాచంద్రన్ గారూ మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. ప్రొటోకాల్ ప్రకారం భద్రత కోసం కృత్రిమ అవయవాలను తీసి చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రయాణికులను అవమానించాలనే ఉద్దేశం కాదు అంటూ సీఐఎస్ఎఫ్ ట్వీట్ చేసింది. నటి సుధాచంద్రన్ గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది.