చెన్నై: టెర్రస్పై ప్రియురాలితో మాట్లాడుతున్న యువకుడు ఆమె తల్లి రావడం గమనించాడు. దీంతో ఆమె కంటపడకుండా ఉండేందుకు అక్కడి నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయం కావడంతో మరణించాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధర్మపురిలోని కామరాజ్ నగర్కు చెందిన 18 ఏళ్ల సంజయ్, సేలంలోని సెంట్రల్ లా కాలేజీలో ఎల్ఎల్బీ మొదటి ఏడాది చదువుతున్నాడు. స్కూల్ నుంచి పరిచయం ఉన్న యువతి కూడా అదే కాలేజీలో లా చదువుతున్నది. క్లాస్మేట్స్ అయిన వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ యువతి కుటుంబం అద్దెకు ఉండే ఇంటి సమీపంలోనే బ్యాచిలర్స్తో కలిసి రూమ్లో అతడు ఉంటున్నాడు.
కాగా, శనివారం అర్ధరాత్రి వేళ సంజయ్ తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. వారిద్దరూ బాల్కానీ వద్ద మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆ యువతి తల్లి అక్కడకు వస్తుండటాన్ని సంజయ్ చూశాడు. తమ విషయం ఆమెకు తెలియకుండా ఉండేందుకు టెర్రస్ పైనుంచి కిందకు దూకాడు. అయితే నేలకు తల బాగా తగలడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.