కోల్కతా, జూలై 9: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె హత్య నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ సంచలనాత్మక కథనం వెలువరించింది. అబె హత్యకు, మోదీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి ముడిపెడుతూ స్టోరీ ప్రచురించింది. అబెను హత్య చేసిన తెత్సుయా యమగామి జపాన్ నేవీలో మూడేండ్లు పనిచేసిన తర్వాత ఉద్యోగం పోయిందని, తర్వాతి నుంచి అతనికి పెన్షన్ రావడం లేదని పేర్కొన్నది. ఈ సందర్భంగా జపనీస్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ బలగాలను అగ్నిపథ్ స్కీమ్తో జాగో బంగ్లా పోల్చింది. మోదీ సర్కార్ కూడా ఇలానే కాంట్రాక్టు పద్ధతిలో యువతను సైన్యంలో నియమించుకునేందుకు అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చిందని.. ఆ తర్వాత పెన్షన్, ఇతర బెనిఫిట్స్ ఉండవని వ్యాఖ్యలు చేసింది. నిరుద్యోగిగా ఉన్నాననే నిరాశ నిస్పృహలతో నిందితుడు అబెను టార్గెట్గా చేసుకున్నాడని పేర్కొన్నది. కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్పుత్ కూడా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అబెపై దాడి చేయడానికి యమగామికి గల ప్రేరణను అగ్నిపథ్తో పోల్చారు. జపాన్ డిఫెన్స్ బలగాల నుంచి రిటైర్డ్ అయిన తర్వాత వన్టైమ్ పేమెంట్ పొందుతారు. ఆ తర్వాత వారికి ఎటువంటి రెగ్యులర్ పెన్షన్ స్కీమ్ లేదు.
మొదట వేరే వారిని చంపాలనుకున్నా..
మొదట మత సంస్థకు చెందిన ఓ నేతను చంపాలనుకున్నానని జపాన్ మాజీ ప్రధాని షింజో అబెను హత్య చేసిన దుండగుడు తెత్సుయా యమగామి పోలీసులకు తెలిపాడు. ఓ మత సంస్థపై తనకు తీవ్రమైన ద్వేషం ఉందని, అయితే ఆ సంస్థకు షింజే అబెతో సంబంధాలు ఉన్నట్టు తెలిసి ఆయన్ని కాల్చినట్టు చెప్పాడు. యమగామి చంపాలనుకున్న మత సంస్థకు చెందిన నేత ఎవరనే దానిపై వివరాలు తెలియలేదు. యమగామి నావికాదళంలో కొద్ది కాలం పాటు పనిచేశాడని అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన అతను.. రెండు నెలల కిందట మరో ఉద్యోగం మానేశాడని చెప్పారు.