పట్నా: బీహార్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన ఆర్జేడీ, జేడీయూ త్వరలో విలీనం కాబోతున్నాయా..? రెండు పార్టీలను ఒక్కటి చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి.. సీఎం నితీశ్కుమార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లనున్నారా..? నితీశ్కుమార్ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను కూడగట్టి ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టబోతున్నారా..? ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నది.
ఇవాళ నితీశ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వియాదవ్ను ముందుకు నడిపించే సమయం వచ్చిందని చెప్పారు. ఆర్జేడీ, జేడీయూ విలీనం కాబోతున్నాయనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్య.. తేజస్విని ముఖ్యమంత్రిని చేసి, తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారనే సంకేతాన్నిస్తున్నది. ఈ విషయాన్ని నితీశ్కుమార్ ఖండిస్తున్నప్పటికీ.. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఢీకొట్టగల అతి కొద్దిమంది కాంగ్రెసేతర నాయకుల్లో ఆయన ఒకడిగా ఉన్నారు.
ఇదిలావుంటే జేడీయూ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వేసిన పోస్టర్లో ఆ పార్టీ నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ సామాజిక న్యాయంతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది అని పేర్కొన్నారు. బీహార్లో ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాలు ప్రధాన ఓటు బ్యాంకు కాగా, ఇతర బీసీ సామాజిక వర్గాలన్నీ జేడీయూ ఓటు బ్యాంకుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లలన్ సింగ్ తన పోస్టర్లో సామాజిక న్యాయం అనే పదాన్ని వాడటం ఆ రెండు పార్టీలు విలీనం కాబోతున్నాయనడానికి మరో సంకేతంగా నిలుస్తున్నది.