న్యూఢిల్లీ: యూపీలోని ఘాజియాబాద్కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు(Ghaziabad Sisters) 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆ అమ్మాయిలు.. కొరియన్ లవ్ గేమ్ ఆడుతున్నట్లు నిర్ధారించారు. బాధిత అమ్మాయిలకు కొరియన్ పేర్లు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నిషికా(16), ప్రాచి(14), పాకి(12) అనే అమ్మాయిలకు మారియా, అలీజా, సిండీ అనే కొరియన్ పేర్లతో కూడిన సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. కొరియన్ పాప్ కల్చర్ ప్రభావం ఆ ముగ్గురిపై ఉన్నట్లు తేల్చారు.
కొరియన్ పేర్లతో ఉన్న ఆ ముగ్గురికీ ఆన్లైన్లో విపరీతమైన ఫాలోవర్లు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే కూతుళ్ల నుంచి తండ్రి ఫోన్ లాక్కోవడం వల్లే.. ఆ ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. మొబైల్ లాక్కోవడం వల్ల ముగ్గురూ మనోవేదనకు గురయ్యారు. ఫోన్ లేకపోవడం వల్ల కొరియా డ్రామాలు చూడలేకపోయారు. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లకు దూరం అయ్యారు. అయితే తండ్రి చేతన్ కుమార్ వృత్తిరీత్యా వ్యాపారి. ప్రస్తుతం ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. సుమారు రెండు కోట్ల అప్పు చేసినట్లు పోలీసులు తేల్చారు.
ఇంటి ఖర్చుల కోసమే మొబైల్ ఫోన్లు అమ్మినట్లు భావిస్తున్నారు. ఆ ఫోన్లను అమ్మేసిన కరెంటు బిల్లు కట్టేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. కూతుళ్లతో వాగ్వాదం జరిగిన సమయంలో పెళ్లి చేస్తానని చెప్పి తండ్రి బెదిరించినట్లు తెలిసింది. ఇది వారి మానసిక స్థితిపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు జాయింట్గా సోషల్ మీడియా అకౌంట్ ఆపరేట్ చేశారు. కొరియన్ స్టయిల్ పేర్లతో వాళ్లను వాళ్లు పిలుచుకునేవారు. కొరియన్ డ్రామా, మ్యూజిక్, ఫ్యాషన్తో కూడిన కాంటెంట్ను తమ అకౌంట్లో పోస్టు చేసేవారు. ముగ్గురూ చాలా క్లోజ్గా ఉండేవాళ్లు అని, ఎప్పుడూ ఒక్కదగ్గరే గడిపేవారని స్థానికులు చెబుతున్నారు. ఎక్కువ సమయం మొబైల్తో గడపడం, ఆన్లైన్కే అంకితం అవ్వడం వల్లే కుటుంబంలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. కొరియాకు వెళ్లాలని భావిస్తున్నట్లు ఆ ముగ్గురు ఎప్పుడూ చెప్పేవారని తండ్రి పేర్కొన్నారు. కుటుంబసభ్యులు, పొరుగింటి వారి నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు.