Supreme Lawyers | ప్రధాని మోదీ భద్రతా లోపానికి సంబంధించిన కేసు విషయంలో తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పలువురు సుప్రీం కోర్టు న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఖలిస్తానీ అనుకూల సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ అనే సంస్థ నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోమవారం ఉదయం 10ః40 నిమిషాలకు తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని వారు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఓ జాతీయ ఛానల్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రధాని మోదీ ప్రయాణించే రోడ్డు మార్గాన్ని బ్లాక్ చేయడానికి ఎస్ ఎఫ్జె గ్రూపు కారణమని వారు ఆరోపిస్తున్నట్లు సుప్రీం న్యాయవాదులు వెల్లడించారు. రైతులకు అన్యాయం చేసిన మోదీకి సహకరించవద్దని, అలాగే 1984 సిక్కు ఊచకోతల విషయాన్ని కూడా ప్రస్తావించారని పేర్కొంటున్నారు. అలాగే సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న సమయంలో మరణించిన రైతుల విషయంలోనూ సుప్రీం మౌనంగా ఉందని వారు ఫోన్లో ఆరోపించారు.
+447418365564 అనే నంబర్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని సుప్రీం కోర్టు న్యాయవాది నిఖిల్ జైన్ పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ విష్ణుశంకర్ జైన్ కూడా ఇదే విధమైన ఆరోపణ చేశారు. ఇలా బెదిరింపు కాల్స్ రావడం చాలా ఆలోచించాల్సిన పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఇక… తనకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని మరో సుప్రీం లాయర్ నిశాంత్ కట్నేశ్వర్కర్ పేర్కొన్నారు. యూకే నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన వెల్లడించారు.