న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించడంపై వస్తున్న విమర్శలపై ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. మద్రాస్ హైకోర్టుకు సమర్పించే అఫిడవిట్లో ఆయన వివరణ ఇచ్చారు. నిజానికి కొన్ని దశల ఎన్నికలను వాయిదా వేద్దామని అనుకున్నాం. కానీ రాష్ట్రపతి పాలన పెడితే అది ఎన్నికల సంఘంపై విమర్శలకు తావిచ్చినట్లు అవుతుంది. ఒక పార్టీకి అనుకూలంగా, మరో పార్టీకి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వస్తాయి. అందుకే అలాగే ఎన్నికలు నిర్వహించాం అని రాజీవ్ కుమార్ వెల్లడించారు. అయితే ఈ అఫిడవిట్ను ఎన్నికల సంఘం తిరస్కరించడంతో దీనిని మద్రాస్ హైకోర్టులో దాఖలు చేయలేదు.
పశ్చిమ బెంగాల్లో మిగతా దశల పోలింగ్ను కలిపేద్దామన్న ఆలోచన కూడా ఎన్నికల సంఘం చేసినట్లు రాజీవ్కుమార్ చెప్పారు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 30 ప్రకారం ఒక్కో ఎన్నికల దశ ప్రత్యేకమైనది, ఒక్కోదానికి ఒక్కో నోటిఫికేషన్ వేయాల్సిందేనని స్పష్టం చేస్తోంది అని ఆయన చెప్పారు. అయితే ఏడు, ఎనిమిది దశలను చట్టపరంగా కలిపే వీలు ఉన్నదని, వీటికి నోటిఫికేషన్ ఒకటే కాబట్టి.. ఏప్రిల్ 26, 29 మధ్య ప్రచారం జరగకుండా చూసుకున్నట్లు చెప్పారు.
ఆ సమయంలో ప్రచారం ముగించాల్సిన సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు పెంచారు.
తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, వ్యక్తిగతం శిక్షించినా తనకు సమ్మతమేనని రాజీవ్ కుమార్ చెప్పడం గమనార్హం. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా నిరుత్సాహపరిచాయని ఆయన చెప్పారు.
ఈ విషయంలో సంఘానికి శిక్ష వేయకుండా, వ్యక్తులకు వేయాలని ఆయన కోర్టును కోరారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తనను వ్యక్తిగతంగా బాధ్యున్ని చేయాలని కూడా రాజీవ్ కుమార్ కోరడం గమనార్హం. ఎన్నికల సంఘంపై పడిన మచ్చను తొలగించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.