Nitish Kumar | లాలూప్రసాద్ యాదవ్ సారధ్యంలోని ఆర్జేడీ-కాంగ్రెస్ మహా ఘట్బంధన్ కూటమిపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అధికారంలో ఉన్పప్పుడు ముస్లింల ఓట్లు పొందుతారు. కానీ మత కలహాలను నివారించడంలో విఫలం అయ్యారు’ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ తదితరులు సోమవారం భాగల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1989లో భాగల్పూర్లో జరిగిన మత కలహాల్లో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నితీశ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం ఏర్పడింది.
‘2005లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. ఫలితంగా ప్రజలు రాత్రి పొద్దుపోయే వరకూ నిద్రపోయే వారు కాదు. ముస్లింల ఓట్లు అడిగే వారు దీన్ని నిలువరించలేకపోయారు’ అని పేరు చెప్పకుండానే ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీల కూటమిపై నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. 1990లో అధికారంలోకి వచ్చిన ఆర్జేడీ ప్రభుత్వం కొనసాగిన 15 ఏండ్ల పాటు భాగల్పూర్ నిందితులకు శిక్ష పడలేదన్నారు. తమ ప్రభుత్వం బీహార్లో ఏర్పాటైన తర్వాతే రాష్ట్రంలో పరిస్థితులు మారాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో జరిగిన మత కలహాల్లో దోషులపై విచారణ జరిగిందని, వారికి శిక్ష పడిందని చెప్పారు.