న్యూఢిల్లీ : ప్రేమకు ఎలాంటి సరిహద్దులు, పరిమితులు ఉండవని ఓ వ్యక్తి (Viral Post) మరోసారి నిరూపించాడు. భారత్కు చెందిన ఆర్టిస్ట్ డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ మహనందియ స్వీడన్లోని తన భార్యను కలుసుకునేందుకు ఏకంగా నాలుగు నెలల పాటు సైకిల్పై ప్రయాణించి గమ్యస్ధానానికి చేరుకున్నాడు. చార్లెట్ వన్ స్కెవ్దిన్ భారత్కు వచ్చిన క్రమంలో మహనందియ ఆమెతో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ కధ స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచిపోతుంది. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన మహనందియ గీసిన తన చిత్రాన్ని తీసుకునేందుకు స్కెవ్దిన్ నేరుగా 1975లో ఢిల్లీ వచ్చింది.
ఆ సమయంలో మహనందియ ఆర్టిస్ట్గా అప్పటికే పేరుతెచ్చుకోవడంతో పాటు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్ధి. స్కెవ్దిన్ బొమ్మ గీస్తున్న సమయంలోనే మహనందియ ఆమె అందానికి ముగ్ధుడు కాగా అతడి నిరాడంబరతకు ఆమె పడిపోయింది. తొలి భేటీలోనే తాము ఒకరి పట్ల మరొకరం ఆకర్షితులయ్యామని తాము తొలిచూపులోనే ప్రేమలో పడిపోయామని మహనందియ చెబుతారు. ఆ సమయంలో ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మా తండ్రిని తొలిసారిగా కలుసుకున్నప్పుడు ఆమె చీర ధరించారని మహనందియ గుర్తుచేసుకున్నారు.
కుటుంబ పెద్దల అంగీకారం, ఆశీస్సులతో గిరిజన సంప్రదాయం ప్రకారం తాము ఒక్కటయ్యామని చెప్పారు. మహనందియ చదువు పూర్తిచేయాల్సిన క్రమంలో ఆమె స్వీడన్కు వెనుతిరిగింది. ఆపై ఇద్దరూ లేఖలు రాసుకుంటూ టచ్లో ఉండగా ఏడాది తర్వాత భార్యను చూసేందుకు వెళ్లాలని మహనందియ నిర్ణయించుకున్నాడు. విమానం టికెట్కు డబ్బులు లేకపోవడంతో విలువైన వస్తువులను అమ్మి ఓ సైకిల్ కొన్నాడు. ఇక సైకిల్పై స్వీడన్ టౌన్ బొరాస్కు వెళ్లేందుకు అతడికి నాలుగు నెలలు పట్టింది.
తన ప్రయాణంలో అతడు పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, టర్కీ, ఇరాన్ దేశాలను దాటుకుంటూ వెళ్లాడు. 1977 జనవరి 22న మహనందియ తన ప్రయాణాన్ని ప్రారంభించగా మే 28న యూరప్ చేరుకున్నాడు. సైకిల్పై రోజుకు 70 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించాడు. ఇక స్వీడన్లో వీరు అధికారికంగా వివాహం చేసుకోగా ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. మహనందియ ఇప్పటికీ ఆర్టిస్ట్గా కొనసాగుతూ తన సృజనాత్మకతకు పదును పెడుతున్నారు.
Read More