న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా సాగాలని సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొన్నది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగడానికి తీసుకున్న చర్యలను వివరించాలని సుప్రీంకోర్టు ఇవాళ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అనుమానాలు ఉండవద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్, వీవీప్యాట్ పేపర్ స్లిప్స్తో క్రాస్ వెరిఫికేషన్ చేయాలని పెట్టుకున్న పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ .. ఎన్నికల సంఘం తరపున వాదిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని వీవీప్యాట్ మెషీన్లు ఉన్నాయని కోర్టు ప్రశ్నించింది. సుమారు 17 లక్షల వీవీప్యాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈవీఎంలకు సమానంగా వీవీప్యాట్ మెషీన్లు లేవా అని సుప్రీం ప్రశ్నించింది.