న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. ఇక తన రాజీకాయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీని వీడి ఆయన త్వరలో కేరళలోని తిరువనంతపురం వెళ్లనున్నారు. ఏకే ఆంటోనీ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఉండని, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు. ఏకే ఆంటోని 52 ఏళ్లుగా భారత రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.
విద్యార్థి నాయకుడి నుంచి 1970 తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 37 సంవత్సరాలకే తొలిసారిగా కేరళ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటి వరకు మూడుసార్లు కేరళ సీఎంగా, మూడుసార్లు కేంద్రమంత్రిగా పని చేశారు. ఐదుసార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. పదేళ్లపాటు కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గానూ సేవలందించారు. ఏకే ఆంటోనీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన.. చాలా తర్జన భర్జనల అనంతరం కొంతకాలం కిందట తన నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలిపారు. అలాగే తన నిర్ణయాన్ని కేరళలోని రాష్ట్ర ఇన్చార్జి, ఇతర నేతలకు తెలిపారు.
ఏకే ఆంటోని కాంగ్రెస్కు నమ్మకమైన నేతల్లో ఒకరు. ఆయన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల కాలంలోనూ పని చేశారు. ఇందిర, రాజీవ్ హయాంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా సేవలందించారు. విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. క్రమక్రమంగా ఎదుగుతూ కాంగ్రెస్కు అత్యంత విశ్వసనీయ నేతల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరం కావడం పార్టీకి పెద్ద దెబ్బేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.