న్యూఢిల్లీ, మే 27: ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రబలుతున్న మంకీపాక్స్ వైరస్ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. భారత్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదుకాలేదని వెల్లడించింది. ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ ముఖర్జీ మాట్లాడుతూ.. మంకీ పాక్స్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చిన వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
జ్వరం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే వారి నుంచి నమూనాలు సేకరించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాలని సూచించారు. మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో 200 మంకీపాక్స్ కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలు ఇప్పటికీ తెలియవని, అయితే వైరస్లో జన్యు పరివర్తన జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.