న్యూఢిల్లీ, జూన్ 27: త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార, విపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠకు ఇటీవలే తెరపడింది. జూలై 18న ఎన్నికలు జరుగనుండగా, 21న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఆగస్టు 11తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగియనున్నది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానున్నది. పైగా తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార, విపక్షాలు ఎవరిని బరిలో దించుతాయనే దానిపై ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటివరకు ఉపరాష్ట్రపతి పదవిని మహిళలు చేపట్టలేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును ఎన్డీయే ఎంపిక చేయగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓబీసీ లేదా జనరల్ కేటగిరీకి చెందిన వారిని బరిలోకి దించుతారని భావిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, మణిపూర్ మాజీ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నదని సమాచారం.