లక్నో: పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు చైర్పర్సన్గా ఉన్న రేణుకా మిశ్రాను విధుల నుంచి తప్పిస్తూ యోగి ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
ఆమెను వెయిటింగ్ లిస్టులో ఉంచి విజిలెన్స్ డైరెక్టర్ రాజీవ్ కృష్ణన్కు బోర్డు అదనపు బాధ్యతలు అప్పగించింది. కానిస్టేబుళ్ల నియామకం కోసం ఫిబ్రవరి 17,18 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షకు 48 లక్షల మంది హాజరయ్యారు. అయితే ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో దానిని రద్దు చేస్తున్నామని, ఆర్నెల్లల్లోగా తిరిగి నిర్వహిస్తామని ఫిబ్రవరి 24న ప్రభుత్వం తెలిపింది.