Jharkhand | మేదినీ నగర్: జార్ఖండ్లో ఇటీవల విదేశీ పర్యాటకులపై సామూహిక లైంగిక దాడి ఘటనను మరువక ముందే మరో దారుణ ఘటన ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్నది. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ కళాకారిణి (21)పై ఆమెతోపాటు ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన కళాకారులు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలో శనివారం ఈ దారుణం జరిగినట్టు చెప్పారు. జార్ఖండ్లోని పాలము జిల్లాలోని విశ్రామ్పూర్లో ఓ ప్రదర్శన ఇచ్చేందుకు ఆమె వచ్చారు.
ఆ కార్యక్రమం అనుకోకుండా రద్దవడంతో, హుస్సేనాబాద్లో మరొక ప్రోగ్రామ్ కోసం తన సహ కళాకారులు ముగ్గురితో కలిసి కారులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో వారు ఆమెకు మత్తు పదార్థం ఇచ్చి, లైంగికదాడికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయిన ఆమెను రోడ్డు పక్కన పడేసి, పారిపోయారు. ఈ సంఘటన గురించి పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.