జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే మేవార్ ‘మాయాజాలం’ బీజేపీ విజయానికి కీలకంగా మారింది. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొల్లగొట్టింది. మేవార్ ప్రాంతంలో (Mewar region) 35 అసెంబ్లీ స్థానాలున్నాయి. దక్షిణ రాజస్థాన్లో కీలకమైన ఆరు జిల్లాలైన ఉదయపూర్, చిత్తోర్గఢ్, భిల్వారా, ప్రతాప్గఢ్, రాజ్సమంద్, ఝలావర్లోని పిరావా తహసిల్ మేవార్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలోని 35 స్థానాల్లో బీజేపీ 26 సీట్లలో ఆధిక్యంలో కొనసాగింది. మరోవైపు కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది.
కాగా, ఉదయపూర్లో టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య రాజస్థాన్లో కలకలం రేపింది. దీని ఆధారంగా అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ తన ప్రచారంలో లక్ష్యంగా చేసుకున్నారు. ‘మేవార్ జీత్ లియా తో రాజస్థాన్ జీత్ లియా’ ( మేవార్ గెలిస్తే రాజస్థాన్ గెలిచినట్లే) అన్న ఆ రాష్ట్ర పాత సామెతను, ఆ ప్రాంత అదృష్ట ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు.