న్యూఢిల్లీ, మే 15: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడాన్ని కొనసాగించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కే విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని అమెరికాకు చెందిన వ్యాధుల నివారణ, నియంత్రణ కేంద్రం (సీడీసీ) ప్రకటించిన మరుసటి రోజే.. ప్రజలను గులేరియా, రాఘవన్ అప్రమత్తం చేశారు. ‘మరింత డాటా వచ్చేవరకైనా మనం జాగ్రత్తగా ఉండాలి. కరోనా వైరస్ చాలా తెలివైనది. మ్యుటేషన్లతో రూపం మార్చుకుంటున్నది. కొత్త వేరియంట్ల నుంచి వ్యాక్సిన్లు కల్పించే రక్షణ ఏమిటనేది చెప్పలేం. కాబట్టి నిబంధనలను కొనసాగించాల’ని గులేరియా తెలిపారు.