న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. అనర్హత వేటు తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున ప్రస్తుతానికి వ్యాఖ్య లు చేయబోమని ఈయూ విదేశాంగ వ్యవహారాల ప్రధాన అధికార ప్రతినిధి పీటర్ స్టానో పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ పరిణామాలను పరిశీలిస్తున్నామని, రాహుల్ గాంధీ అప్పీల్పై కోర్టు తీర్పు అనంతరం మాట్లాడుతామని తెలిపారు. ఇదే సమయంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకమైనదని, మన ప్రజాస్వామిక సమాజంలో బహుళత్వవాదం, భిన్న అభిప్రాయాలు, ఆలోచనలను చర్చించడం ముఖ్యమైన లక్షణాలు అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్గాంధీపై మరో పరువునష్టం దావా దాఖలైంది. ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆయన ఆరెస్సెస్ సభ్యులను ఉద్దేశించి 21వ శతాబ్దపు కౌరవులు అని అన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆరెస్సెస్కు చెందిన ఓ కార్యకర్త ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 12న విచారణ జరిగే అవకాశమున్నది.