లఖింపూర్ ఖేరీ ఘటన ప్రణాళికా ప్రకారం జరిగిన కుట్రే అనిసిట్ నివేదిక రావడంతో కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ తాజాగా డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా సిట్ నివేదికపై స్పందించాల్సిందిగా విలేకరులు అడగ్గా, విలేకరులపై ఆగ్రహంతో ఊగిపోవడం, చిందులు వేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగాయి.
అయితే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి ఇప్పట్లో తొలగించేందుకు, ఆయనపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, సిట్ తన పూర్తి నివేదికను ఇంకా సమర్పించనే లేదన్నది బీజేపీ వాదనగా తెలుస్తోంది. అయితే జర్నలిస్టులపై అజయ్ మిశ్రా దుర్భాషలాడటం, దూషించడం మాత్రం నూటికి నూరు శాతం తప్పేనని బీజేపీ భావిస్తోందని కూడా ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగానీ ఆయన్ను మాత్రం కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం సిద్ధంగా లేనేలేదని తెలుస్తోంది.
మరో వాదన కూడా ఢిల్లీ వేదికగా నడుస్తోంది. అజయ్ మిశ్రా బ్రాహ్మణ వర్గానికి చెందిన బలమైన నేత. యూపీ ప్రాంతంలో కాస్త పట్టున్న నేత. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రధాని మోదీ ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారని బీజేపీ వర్గాల కథనం. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ప్రకారం అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే… యూపీలోని బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందేమోనని బీజేపీ అగ్రనేతల భావనగా తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రతిపక్షాలు ఎన్ని డిమాండ్లు చేస్తున్నా, అజయ్ మిశ్రా విషయంలో బీజేపీ ధైర్యంగా అడుగులు వేయలేకపోతోందని సమాచారం.