న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 12న ఆ రాష్ట్రంలోని 68 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా ముఖంగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. నవంబర్ 12న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. మొత్తం 68 సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
అటు.. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను ఎలా నెరవేర్చుతాయో వివరణ కోరే ప్రతిపాదనపై అన్ని పార్టీల స్పందన కోసం వేచిచూస్తున్నామని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినా గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ను మాత్రం ఈసీ విడుదల చేయలేదు. దీనిపై రాజీవ్ కుమార్ను వివరణ కోరగా.. వాతావరణ పరిస్థితుల వల్లే హిమాచల్ప్రదేశ్కు ముందుగా షెడ్యూల్ విడుదల చేస్తున్నట్టు తెలిపారు. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి జనవరి 8న గడువు ముగుస్తున్నదని, గుజరాత్కు మాత్రం ఫిబ్రవరి 18న గడువు ముగుస్తుందని చెప్పారు. రెండు అసెంబ్లీల గడువు తీరే సమయం 40 రోజుల గ్యాప్ ఉన్నందున ఇప్పటికి హిమాచల్కు మాత్రమే షెడ్యూల్ విడుదల చేశామని పేర్కొన్నారు.