ప్రతి బిడ్డకూ తల్లే ప్రాణం పోస్తుంది. బిడ్డ అనారోగ్యానికి గురైతే, తన పంచ ప్రాణాలను అడ్డుగా పెట్టి, రక్షించుకోడానికి శతధా ప్రయత్నిస్తూనే ఉంటుంది. నా ఆయుష్షును కూడా పోసుకొని, నిండు నూరేళ్లూ చల్లగా బతుకు తండ్రీ… అని ఒక్క తల్లి మాత్రమే దీవిస్తుంది. లోకంలో చెడ్డ కుమారులుంటారేమో గానీ… చెడ్డ తల్లులు మాత్రం ఉండరు. కానీ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఓ తల్లి తన రెండేళ్ల పసిబిడ్డ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించింది. తన రెండేళ్ల చిన్నారిని ఇంటి దగ్గర్లో ఉన్న ఓ బావిలో విసిరేసింది. దీంతో ఆ పసి బాలుడు ఊపిరాడక కొట్టుకున్నాడు. అయినా ఆ తల్లి ప్రాణం చలించలేదు.
పైగా… ఆ పసిబిడ్డ చనిపోయేంత వరకూ ఆ బావి దగ్గరే నిల్చుంది. ప్రాణాలు పోయాయి అని నిర్ధరించుకున్న తర్వాతే అక్కడి నుంచి నిష్క్రమించింది. ఆ తల్లి పేరు మాయా పాంచాల్. అయితే భర్త వెంకట్ తన ఆఫీస్ను ముగించుకొని, ఇంటికి చేరుకోగానే పిల్లాడి గురించి ఆరా తీశాడు. బావిలో పడేశానని భార్య పాంచాల్ తెగేసి చెప్పడంతో భర్త కాళ్లు గజగజా వణికిపోయాయి. కాసేపు తేరుకోలేకపోయాడు. చివరికి… పోలీసులను ఆశ్రయించి, తన భార్యపై ఫిర్యాదు చేశాడు. అయితే పాంచాలి మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అందుకే ఇలాంటి ఘటనకు పాల్పడిందని పోలీసులు తేల్చేశారు. చివరికి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా పోలీసులు సంబంధిత కుటుంబ సభ్యులను కూడా విచారించారు. అయితే ఈ ఇద్దరు దంపతులు ఎప్పుడూ గొడవలకు దిగేవారని, వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ కారణంగానే ఆ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.