న్యూఢిల్లీ: కరోనా కారణంగా నిలుపుదల చేసిన 18 నెల డియర్నెస్ అలవెన్స్లు, డియర్నెస్ రిలీఫ్లను ఇతర అవసరాల కోసం వాడుకొన్నామని, అవి ఇక చెల్లించే అవకాశం లేదని సోమవారం లోక్సభలో కేంద్రం వెల్లడించింది. ‘కొవిడ్-19 కారణంగా ప్రభుత్వానికి ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 1-1-2020, 1-7-2020, 1-1-2021న ఇవ్వాల్సిన డీఏ, డీఆర్లను నిలిపేశాం.
2020లో ఆర్థిక కష్టాల వల్ల, 2021 లో సంక్షేమ పథకాలకు నిధులను సర్దటం కోసం ఆ నిధులను ఉపయోగించాం. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరంలో డీఏ, డీఆర్ బకాయిలు ఇవ్వలేదు. ప్రస్తుతం కూడా ప్రభుత్వ ఆర్థిక లోటు అలాగే ఉన్నందున ఆ బకాయిలను ఇవ్వటం సాధ్యం కాదు’ అని పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్రం కుండ బద్ధలు కొట్టింది.