NREGA | న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర పన్నుతున్నది. విపక్ష పాలిత రాష్ర్టాలకు బకాయిలు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నది. మరోవైపు పారదర్శకత పేరుతో డిజిటలైజేషన్ చేస్తూ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. ఇంకోవైపు నిధుల కేటాయింపు, విడుదలలోనూ కోత విధిస్తున్నది. ఈ పథకం రూ.6,146.93 కోట్ల లోటుతో నడుస్తున్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్సైట్లో ఇటీవల పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం కేంద్రం రూ.60 వేల కోట్లు కేటాయించింది.
బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది 18 శాతం తక్కువ. అలాగే గతేడాది బడ్జెట్తో పోలిస్తే 33 శాతం తక్కువ. ఈ నేపథ్యంలో గత నెల 15న రూ.23 వేల కోట్ల సప్లిమెంటరీ బడ్జెట్ కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖను సంప్రదించింది. అయితే డిమాండ్కు తగినట్టు ఈ పథకానికి బడ్జెట్ కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 93.5 శాతం నిధులను రాష్ర్టాలకు విడుదల చేశామని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్ సింగ్ ఇటీవల వెల్లడించారు. పథకం నిర్వహణకు రూ.6,146 కోట్ల లోటు ఎందుకు ఏర్పడిందో ఆయన సమాధానం ఇవ్వలేదు. ఈ ఏడాది జూలై 31 నాటికి కేంద్రం 18 రాష్ర్టాలకు మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.6,366 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
కేంద్రం ప్రతి ఏడాదీ ఇదే ‘కథ’ చెప్తున్నదని.. డిమాండ్ ఆధారిత పథకమని చెప్తూనే బడ్జెట్ కోతలు విధిస్తున్నదని లావణ్య తమంగ్ అనే పరిశోధకురాలు వెల్లడించారు. ‘సాధారణంగా సప్లిమెంటరీ బడ్జెట్ సరిపడినంత ఉండదు. శీతాకాలంలో మాత్రమే దాన్ని ఆమోదిస్తారు’ అని తెలిపారు. అందుబాటులో ఉన్న నిధులు తగ్గిపోతే బకాయిలు పెరిగిపోతాయని.. తద్వారా పనుల కేటాయింపు కూడా తగ్గిపోతుందని ఆమె విశ్లేషించారు.
పశ్చిమ బెంగాల్కు రూ.6,907 కోట్ల ఉపాధి హామీ నిధుల బకాయిలు వెంటనే నిధులు విడుదల చేయాలని టీఎంసీ శ్రేణులు ఢిల్లీలో నిరసన చేపట్టాయి. కోల్కతాలో రాజ్భవన్ ముందు ధర్నాకు దిగాయి. అయినా కేంద్రం స్పందించడం లేదు. ‘చట్ట స్ఫూర్తిని కేంద్రం పాటించాలనుకోవడం లేదు. 2021 డిసెంబర్ 24 నుంచి కేంద్రం పశ్చిమ బెంగాల్కు నిధుల విడుదల ఆపేసింది. కానీ 2022 మార్చి 9 వరకు చట్టంలో సెక్షన్ 27ను పొందుపరచలేదు. ఈ సెక్షన్ ప్రకారం పథకం అమలుకు సంబంధించి ఫిర్యాదులు వస్తే నిధుల విడుదలను నిలుపుదల చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది’ అని పశ్చిమ బెంగాల్ సీఎం సలహాదారు, మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. అన్యాయంగా కేంద్రం నిలిపేసిన నిధులపై వడ్డీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు బకాయిలపై ఇప్పటికే కొన్ని ఎన్జీవోలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు తీర్పును అనుసరించి తదుపరి కార్యాచరణ చేపట్టాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భావిస్తున్నది.
‘ఉపాధి’ పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని కర్ణాటక సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా పని దినాల సంఖ్యను పెంచాలని కోరింది. రాష్ర్టానికి కేంద్రం విడుదల చేయాల్సిన రూ.475 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం కేంద్ర బృందం కర్ణాటకలో పర్యటించి కరువు తీవ్రతను అంచనా వేసింది.