రావల్కోట్, జూన్ 30: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు మంగళవారం నాటకీయ మలుపు తీసుకుంది. పీవోకే పాకిస్థాన్లో భాగమే కాదంటూ నిరసనకారులు ప్రకటించారు. ఈ ప్రాంతానికి అత్యవసర ఆహార పదార్థాల నిలిపివేతను కనుక ఇస్లామాబాద్ కొనసాగిస్తే తాము ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటామని వారు హెచ్చరించారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద పాకిస్థాన్ అధికారులు ఈ నెల ప్రారంభంలో జమ్ము కశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)పై నిషేధం విధించడంతో ఆ సంస్థ ఆధ్వర్యంలో పీవోకేలోని రావల్కోట్ ఈద్గా గ్రౌండ్లో నిరసనకారులు తమ ఆందోళనను కొనసాగించారు. ‘పీవోకేలోని రావల్కోట్, మీర్పూర్ నివాసితులు అసలైన కశ్మీరీలు కాదు’ అంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల ప్రకటించడంపై వారు మండిపడ్డారు.
ఈ సందర్భంగా రేషన్, అత్యవసరాల సరఫరాలో ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులను పాకిస్థాన్ ప్రభుత్వ మూకుమ్మడిగా శిక్షిస్తున్నదని వారు ఆరోపించారు. ‘మాకు మీ రేషన్ అక్కర్లేదు. మీకు మా సహాయం కావాలి’ అనీ పీవోకే నేత సర్దార్ ఆమన్ ఖాన్ పేర్కొన్నారు. తమ సరుకుల సరఫరా నిలిపివేత ఇంకా కొనసాగిస్తే పౌరులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని ఆయన పాక్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.
సింధూ నదీ జలాలపై ‘యుద్ధం’ వ్యాఖ్యలు చేసిన వారం రోజులకే పాకిస్థాన్ నుంచి మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు వెలువడ్డాయి. సింధూ జలాలను నియంత్రించాలనుకునే వారి చేతులను నరుకుతామంటూ పాక్ వాతావరణ శాఖ మంత్రి ముసాఇదిక్ మాలిక్ విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. పొరుగుదేశ ప్రధానమంత్రి ఒక నల్లాను నియంత్రిస్తున్నారు. పాకిస్థాన్లోకి చుక్క నీరు కూడా ప్రవహించనివ్వబోనని ఆయన అంటున్నారు అంటూ మాలిక్ పేర్కొన్నారు. మాలిక్ ప్రకటనను అనేక వార్తాసంస్థలు, ఆన్లైన్ పోర్టళ్లు ప్రచురించినట్లు డాన్ దినపత్రిక తెలిపింది.
గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దశాబ్దాల నాటి సింధూ జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) అమలును భారత ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ ఒప్పందం విషయంలో యుద్ధం చేస్తామని పాకిస్థాన్ హెచ్చరించిన వారం రోజుల తర్వాత మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆసిఫ్ వ్యాఖ్యలకు భారత్ స్పందిస్తూ పాక్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నదని వ్యాఖ్యానించింది. సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ స్పష్టం చేసింది.