నేషనల్ డెస్క్:పురాణాల్లో చెప్పుకొన్నట్టు పుష్పక విమానం నిజంగానే ఉండేదా? 1903లో రైట్ బ్రదర్స్ విమానాన్ని నడుపడానికి ముందే.. వేల ఏండ్ల క్రితమే లంకాధీశుడైన
రావణాసురుడు విమానాన్ని నడిపాడా? గత కొన్నేండ్లుగా శ్రీలంకలో విరివిగా ప్రచారమవుతున్న ఈ కథలకు శాస్త్రీయపరంగా ఆధారాలను కనుగొనేందుకు అక్కడి ప్రభుత్వం సమాయత్తమైంది. రెండేండ్ల కిందట ప్రారంభమై.. కరోనా సంక్షోభంతో నిలిచిపోయిన ‘ఏవియేటర్ రావణ’ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించింది.
ఏమిటీ ‘ఏవియేటర్ రావణ’?
ప్రపంచంలో మొట్టమొదట విమానాన్ని నడిపింది రావణుడేనని చాలామంది శ్రీలంకవాసుల నమ్మకం. రావణుడి కాలంలో లంకలో విమానాలు, విమానాశ్రయాలు కూడా ఉండేవని వారు చెబుతుంటారు. సీతాన్వేషణకు వచ్చిన హనుమంతుడు వాటిని కాల్చివేశాడన్న ప్రచారం కూడా పెద్దఎత్తున అక్కడ జరుగుతున్నది. శాస్త్రీయ ఆధారాలు లేని ఈ ప్రచారాన్ని పలువురు కొట్టివేస్తూ వచ్చారు. అయి తే, కొందరు ఔత్సాహికులు సొంతంగా దీనిపై పరిశోధనలు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తిచేయలేదు. గత కొన్నేండ్లుగా సాగుతున్న ఈ వాదప్రతివాదనలకు తెరదించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. రావణుడు గగన మార్గంలో విమాన ప్రయాణం చేసినట్టు ప్రచారమవుతున్న కథల్లో వాస్తవమెంత? ఒకవేళ రావణుడు గగనతలంలో ప్రయాణిస్తే.. ఏఏ ప్రాంతాలకు, ఏఏ మార్గాల్లో వెళ్లాడు? దీనిపై సమగ్ర అధ్యయనానికి ఉద్దేశించిన ‘ఏవియేటర్ రావణ’ ప్రాజెక్టును కొనసాగించబోతున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ఇటీవల తెలిపింది.
రెండేండ్ల కిందటే ప్రాజెక్టుకు శ్రీకారం
విమానాన్ని తొలిసారిగా రావణుడే నడిపాడా? అనే వాదనలో నిజాల్ని నిగ్గుతేల్చాలని రెండేండ్ల కిందట అప్పటి శ్రీలంక ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో రాజధాని కొలంబోలో విమానయాన రంగ నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలతో సమావేశాన్ని నిర్వహించింది. రావణుడు మొదట శ్రీలంక నుంచి భారత్కు విమానంలో వెళ్లి వచ్చాడని, అతనే తన విమానాన్ని నడిపాడని ఆ సమావేశంలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. దీనిపై శాస్త్రీయ ఆధారాలను సేకరించేందుకు శ్రీలంక ప్రభుత్వం ‘ఏవియేటర్ రావణ’ ప్రాజెక్టుకు తొలి విడుతగా అక్కడి కరెన్సీలో రూ.50 లక్షలు (భారత కరెన్సీలో రూ. 18.41 లక్షలు) మంజూరు చేసింది. అయితే కరోనా లాక్డౌన్ వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే, ఈ ప్రాజెక్టును పునఃప్రారంభించాలని మహీంద రాజపక్స నేతృత్వంలోని ప్రస్తుత శ్రీలంక ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. రావణుడికి సంబంధించిన సమాచారాన్ని తమకు ఇవ్వాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుగా దీన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని శ్రీలంక పౌర విమానయాన సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు శశి దనతుంగే తెలిపారు. ఈ పరిశోధనలో భాగస్వామి కావాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. పురాతన కాలంలో భారత్, శ్రీలంక సాధించిన విజయాలను చాటేందుకు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
‘దండు మోనర’లో ప్రయాణం!
‘దండు మోనర’లో రావణుడు విహరించినట్టు శ్రీలంక మాజీ రవాణాశాఖ మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వా ఓ సందర్భంలో తెలిపారు. తమ దేశంలోనే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోనూ రావణుడు ‘దండు మోనర’లో విహరించినట్టు పేర్కొన్నారు. శ్రీలంకలోని చాలా కథల్లో కూడా ఈ ‘దండు మోనర’ ప్రస్తావన ఉన్నది. రావణుడిని సింహాళీ బౌద్ధులు కీర్తిస్తారు. రావణుడి పేరు వచ్చేలా సింహాళీ బౌద్ధ గ్రూపు ‘రావణ బాలాయ’ అన్న పేరు కూడా పెట్టుకున్నది. తమిళనాడులోని ద్రవిడ పార్టీ నేతలు కూడా రావణుడిని ఆరాధిస్తారు. శ్రీలంక ప్రయోగించిన తొలి శాటిలైట్కు ‘రావణ-1’ అని పేరు పెట్టారు.
భారత-లంకేయుల పురాతన సాంకేతికత అద్భుతం
రావణుడు కల్పిత పాత్ర కాదు. నిజమైన రాజు. విమానాలు, విమానాశ్రయాలను వేల ఏండ్ల క్రితమే నిర్మించాడు. అవి ప్రస్తుత వాటిని పోలి ఉండకపోవచ్చు. అయితే, పురాతన లంకేయులకు, భారతీయులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. దీన్ని శాస్త్రీయంగా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరమున్నది.
రైట్ బ్రదర్స్ కంటే ముందే ‘విమానం కాన్సెప్ట్’ ఉన్నది
శతాబ్దం క్రితం రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నట్టు చదువుకున్నాం. అయితే, నెమలి ఆకారంలోని పుష్పక విమానం గురించి అంతకుముందే మన పూర్వీకులకు అవగాహన ఉన్నది. అంటే విమానం కాన్సెప్ట్ ఏండ్ల క్రితం ఉన్నట్టే కదా. శ్రీలంకలోని తోటుపోలకందా, ఉస్సాంగొడా, వెహరంగంతోట, రుమాస్సాల, లకేగలా ప్రాంతాలను వేల ఏండ్ల క్రితం విమానాల ల్యాండింగ్కి వినియోగించేవారని తెలుస్తున్నది.