Senthil Balaji | మనీలాండరింగ్ ఆరోపణలతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేయడంపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. ప్రభుత్వ సంస్థలను చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయని విమర్శించాయి. అరెస్టు సమయంలో ఛాతి నొప్పితో కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి సెంథిల్ బాలాజీని పరామర్శించేందుకు డీఎంకే పార్టీ నేతలు క్యూ కట్టారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఆస్పత్రికి వెళ్లి మంత్రిని పరామర్శించారు. అనంతరం సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.
బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. సిద్ధాంతపరంగా బీజేపీపై పోరాటం చేస్తామని ప్రకటించారు. సెంథిల్ బాలాజీ అరెస్టుపై న్యాయపోరాటానికి దిగుతామని తెలిపారు. సెంథిల్ బాలాజీ అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని డీఎంకే ఎంపీ ఎలాంగో విమర్శించారు.
సెంథిల్ బాలాజీ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మోదీ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందని ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. ఇలాంటి చర్యలను విపక్షాలు ఏ మాత్రం ఉపేక్షించవని మండిపడ్డారు.
ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్ఆద్మీ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అనారోగ్యంతో బాధపడుతున్న సెంథిల్ను అరెస్టు చేయడం అమానవీయమని మండిపడింది. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ గాలికొదిలేసి.. ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలోనే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుందని విమర్శించింది. సెంథిల్ బాలాజీ అరెస్టును ప్రతిపక్షాలపై దాడిగానే పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది.
సెంథిల్ బాలాజీ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
వాళ్ల ( బీజేపీ ) మనుషులపై ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని.. ఇప్పటికే ముగ్గురు మంత్రులపై ఈడీకి ఫిర్యాదు చేశామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కానీ ఆ ఫిర్యాదులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి రిప్లై రాలేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు వాళ్లకు వ్యతిరేకంగా ఎందుకు సోదాలు నిర్వహించలేదని మండిపడ్డారు. వాళ్లపై ఎప్పుడు విచారణ జరుపుతారని ప్రశ్నించారు.