చెన్నై, డిసెంబర్ 1: తమిళనాడులో అంకిత్ తివారీ అనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీనియర్ అధికారి లంచాన్ని స్వీకరిస్తూ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దుండిగల్ జిల్లాలో ఓ వైద్యుడి నుంచి రూ.20 లక్షల లంచం స్వీకరిస్తున్న ఆయనను అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ శుక్రవారం వెల్లడించింది. కారులో ప్రయాణిస్తున్న అంకిత్ తివారీని దుండిగల్ పోలీసుల సాయంతో ఓ టోల్గేట్ వద్ద ఆపి అరెస్టు చేసినట్టు పేర్కొన్నది.
ఈ సందర్భంగా ఆయన నుంచి ఓ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నామని, ఆయన ఈడీ అధికారిగా పనిచేస్తున్నట్టు ఆ ఐడీకార్డులో ఉన్నదని వివరించింది. అంకిత్ తివారీతోపాటు ఆయన బృందానికి చెందిన ఈడీ అధికారులు కేసుల మాఫీ పేరుతో అనేక మంది ప్రజలను బెదిరించి లంచాలను స్వీకరిస్తున్నట్టు తెలిపింది. తమిళనాడులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలపై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న తరుణంలో ఈ అరెస్టు జరగడం గమనార్హం. ఇసుక మైనింగ్ కేసులో ఇటీవల తమిళనాడులోని ఐదుగురు జిల్లా కలెక్టర్లకు ఈడీ జారీచేసిన సమన్లపై కొద్ది రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు స్టే విధించింది.