చెన్నై : ఓ 55 ఏండ్ల వ్యక్తి చనిపోయాడని భూమిలో పూడ్చిపెట్టారు. కానీ 24 గంటల్లోనే ఆ వ్యక్తి ఇంటికి తిరిగొచ్చాడు. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నప్పటికీ.. నిజంగానే జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్కు సమీపంలోని బనగలద్పూర్ వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మూర్తి(55) అనే దినసరి కూలీ చెరుకు తోటల్లో పని చేసేందుకు కొద్ది రోజుల క్రితం తిర్పూర్ వెళ్లారు. అయితే ఆదివారం ఉదయం మూర్తి చనిపోయినట్లు అతని కుమారుడు కార్తీకి సమాచారం అందింది. దీంతో కార్తీ అక్కడికి వెళ్లి చూడగా, చనిపోయింది తన తండ్రేనని నిర్ధారించుకున్నాడు. ఇక డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకొచ్చి ఆదివారం రాత్రి పూడ్చిపెట్టారు. అనంతరం అందరూ ఇంటికి తిరిగొచ్చారు.
అయితే సోమవారం సాయంత్రం మూర్తి సజీవంగా ఇంటికి తిరిగొచ్చాడు. మూర్తిని చూసి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. తమ తండ్రి ఇంట్లోకి రావడాన్ని చూసి.. ఇవి తమ కళ్లేనా అని ప్రశ్నించుకున్నామని కార్తీ తెలిపాడు. తమ తండ్రి చనిపోయాడని వార్త తెలిసినప్పుడు గురైన షాక్ కంటే.. అతను మళ్లీ ఇంటికి తిరిగిరావడం మరింత షాక్కు గురి చేసిందన్నాడు కార్తీ. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.