చెన్నై: ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సనాతన ధర్మానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని తిరువారూర్ పట్టణంలోగల ఓ ప్రభుత్వ కాలేజీ సనాతన ధర్మానికి సంబంధించి విద్యార్థులకు ఓ సర్క్యులర్ జారీచేసి వివాదం రేపింది.
సనాతన ధర్మంపై విద్యార్థులంతా తమ అభిప్రాయాలను తెలియజేయాలనేది ఆ సర్క్యులర్ సారాంశం. డీఎంకే దివంగత నాయకుడు అరినార్ అన్న జయంతిని పురస్కరించుకుని సనాతన ధర్మంపై విద్యార్థుల అభిప్రాయాలను కాలేజీ కోరింది. దీనిపై స్థానికంగా తీవ్ర దుమారం రేగుతున్నది. సనాతన ధర్మంపై డీఎంకే వ్యతిరేకతను విద్యార్థులపై రుద్దాలని చూడటం ఏమిటిని కొందరు మండిపడుతున్నారు.
దాంతో తాము సనాతన ధర్మంపై అభిప్రాయాలు తెలియజేయాలని విద్యార్థులను బలవంతపెట్టడంలేదని, అభిప్రాయాలు తెలియజేయదలుకున్న విద్యార్థులు తెలియజేయవచ్చు, లేకపోతే లేదని కాలేజీ యాజమాన్యం తెలిపింది.