జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ గొడవల కారణంగా భార్యభర్తలు విషపు గోలీలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భరత్పూర్ జిల్లాకు చెందిన దీపక్ బన్సాల్ (34), నీశూ (30) ఇద్దరు భార్యాభర్తలు. ఎనిమిదేండ్ల క్రితం వారి వివాహం జరుగగా వారికి ఏడేండ్ల కుమార్తె కూడా ఉన్నది. ఇటీవలే కుమార్తెను నీశూ అమ్మవాళ్లు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరుగడంతో ఇద్దరూ క్షణికావేశంలో ఇంట్లో ఉన్న విషపూరిత సెల్ఫోస్ ట్యాబ్లెట్లు వేసుకున్నారు. అనంతరం దీపక్ బన్సాల్ తాము విషం సేవించిన విషయాన్ని తన బావమరిదికి ఫోన్ ద్వారా తెలియజేశారు. దాంతో బావమరిది, అతని కుటుంబసభ్యులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.