చెన్నై: తమిళనాడులోని ఈరోడ్ తూర్పులో జరుగనున్న ఉప ఎన్నికను నటుడు విజయ్ పార్టీ తమిఝగ వెట్రి కజగం (టీవీకే) బహిష్కరించింది. (Vijay’s TVK boycott by poll) అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే సహా పలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను బహిష్కరించినట్లు ఇప్పటికే ప్రకటించాయి. విజయ్ పార్టీ కూడా ఈ జాబితాలో చేరింది. గతంలో విక్రవాండి ఉప ఎన్నికను బహిష్కరించిన ఆ పార్టీ తన వైఖరిని తాజాగా సమర్థించుకున్నది. ఉప ఎన్నికలో గెలవడానికి సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆరోపించింది.
కాగా, టీవీకే జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడులోని పాలక ప్రభుత్వాలు ప్రజాస్వామ్య నిబంధనలు పాటించకుండా, ఉప ఎన్నికలలో గెలవడానికి తమ అధికారాన్ని ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోందని విమర్శించారు. గతంలో విక్రవాండి ఉప ఎన్నికల సమయంలో తమ పార్టీ తీసుకున్న వైఖరిని ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అందుకే ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని అన్నారు.
మరోవైపు 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే తమ పార్టీ దృష్టిసారించిందని టీవీకే ఏర్పాటు సందర్భంగా విజయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పారు. అలాగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
కాగా, ఈరోడ్ తూర్పు అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఎలంగోవన్ డిసెంబర్లో మరణించారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఫిబ్రవరి 5న ఉప ఎన్నిక జరుగనున్నది. డీఎంకే అభ్యర్థిగా వీసీ చంద్రకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్టీకే అభ్యర్థి ఎంకే సీతాలక్ష్మి ఆయనపై తలపడుతున్నారు. ఉప ఎన్నికకు మిగతా పార్టీలు దూరంగా ఉన్నాయి. దీంతో డీఎంకే, ఎన్టీకే మధ్య పోటీ నెలకొన్నది.