పాట్నా : కరోనా టీకా తీసుకునేందుకు ఆ జనాలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో.. అధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్లతో పాటు గృహ అవసరాలకు ఉపయోగపడే వస్తువులను ఉచితంగా ఇస్తామని బీహార్లోని షియోహార్ జిల్లా అధికారులు ప్రకటించారు. ఈ ఆఫర్ ఇవ్వడానికి గల కారణాలను అధికారులు వివరించారు. జులై 15వ తేదీ నాటికి షియోహార్ జిల్లాలో 45 ఏండ్లు నిండిన వారికి 100 శాతం టీకా ఇవ్వాలని నిర్ణయించాం.
ఎందుకంటే ఆ జిల్లాలోని సుమారు 43 గ్రామాలు వరద ప్రభావిత గ్రామాలు. జులై 15 తర్వాత ఆ గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి. గతేడాది ఈ గ్రామాలు పూర్తిగా వరదకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఆఫర్ ప్రకటిస్తే వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే అధికారులు ఇక్కడ ఒక నిబంధన విధించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ప్రతి వారం ఐదుగురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్స్, కూలర్లు, మెక్రోవేవ్స్ ఇస్తామన్నారు.