రాంచీ, సెప్టెంబర్ 15: తన అనర్హత వేటుపై అనిశ్చితిని తొలగించాలని జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయాస్ను సీఎం హేమంత్ సొరేన్ కోరారు. గురువారం గవర్నర్ను కలిసిన సొరేన్ వినతిపత్రాన్ని సమర్పించారు. ‘నా అనర్హత వేటుపై ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని పంపింది. అది వచ్చి కూడా మూడు వారాలవుతున్నది.
కానీ మీరు (గవర్నర్) ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొన్నది. ఇదే అదునుగా భావిస్తున్న బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన మా ప్రభుత్వాన్ని కూల్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. మా ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి’ అని గవర్నర్ను సొరేన్ కోరారు.