Swati Maliwal case : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలివాల్ (Swati Maliwal) పై దాడి కేసులో విచారణ కొనసాగుతున్నది. నిందితుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar) జ్యుడీషియల్ కస్టడీ (Judicial custody) ని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. జూలై 6వ తేదీ వరకు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు (Tis Hazari Court) ఈ కేసును విచారిస్తున్నది.
బిభవ్కుమార్ గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ శనివారానికి ముగియడంతో పోలీసులు ఆయనను ఇవాళ మరోసారి తీస్ హజారీ కోర్టులో హాజరుపర్చారు. ఇంకా విచారించాల్సి ఉన్నందున బిభవ్ను మరో రెండు వారాలు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు రెండు వారాలపాటు బిభవ్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. బిభవ్ తనపై దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో బిభవ్కుమార్ను మే నెల 18న పోలీసులు అరెస్ట్ చేశారు.
అప్పటి నుంచి నిందితుడిని కొన్ని రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన తీస్ హజారీ కోర్టు.. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దర్యాప్తు అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ జ్యుడీషియల్ కస్టడీని పలు దఫాలుగా పెంచుతూ వస్తున్నది. తాజాగా మరోసారి పొడిగించింది. బెయిల్పై బయటికి వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిసేందుకని గత నెలలో స్వాతి మాలివాల్ ఆయన నివాసానికి వెళ్లింది. అయితే అప్పాయింట్మెంట్ లేదన్న కారణంతో అధికారులు ఆమెకు అనుమతి నిరాకరించారు.
దాంతో స్వాతిమాలివాల్ అధికారులతో వాగ్వాదానికి దిగింది. దీనికి సంబంధించి దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ సందర్భంగా కేజ్రివాల్ పర్సనల్ సెక్రెటరీ బిభవ్కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాలివాల్ ఆరోపణలు అబద్ధమంటూ.. అందుకు రుజువుగా సీసీ ఫుటేజ్ను విడుదల చేసింది. అయితే తనపై దాడి జరిగిన దగ్గర సీసీ కెమెరా లేదని, ఆప్ విడుదల చేసిన ఫుటేజ్ దాడికి ముందుదని స్వాతిమాలివాల్ పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు బిభవ్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.