Nirbhaya fund | నిర్భయ నిధులతో పోలీసుల కోసం కొనుగోలు చేసిన బొలేరో వాహనాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమైన శివసేన ఎమ్మెల్యేల రక్షణ కోసం వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు అందుబాటులో లేక పోలీసులు కండిషన్లో లేని పాతవాహనాలు ఉపయోగించుకోవాల్సి వస్తోంది. దీంతో వారి విధులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం దిగివచ్చింది. ముంబయి పోలీస్ మోటారు ట్రాన్స్పోర్ట్ యూనిట్ గ్యారేజీలో సోమవారం సాయంత్రం పార్క్ చేసిన కొన్ని బొలేరో వాహనాలను రాత్రి సమయంలో తిరిగి పోలీసు స్టేషన్లకు తరలించింది. శివాజీ నగర్, ఘట్కోపర్, ములుంద్ పోలీస్ స్టేషన్లకు తరలించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్లో నిర్భయ నిధులతో 220 బొలెరో వాహనాలు కొనుగోలు చేసింది. వీటిలో 47 వాహనాలను ఎమ్మెల్యేలకు రక్షణ కోసం పంపించింది. కొద్ది వారాల తర్వాత 17 వాహనాలను తిరిగి ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగించింది. మిగిలిన 30 వాహనాలు ఎమ్మెల్యేల కాన్వాయ్లలోనే ఉంటున్నాయి.