న్యూఢిల్లీ: జ్ఞానవాపీ మసీదు కాంప్లెక్స్లో పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టిన కార్బన్ డేటింగ్ సర్వేను వెంటనే నిలిపివేయాలని సోమవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. జూలై 21న వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. జూలై 26 సాయంత్రం 5 గంటల వరకు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, ఈలోగా ముస్లింల తరఫు న్యాయవాదులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మసీదులో సర్వేని ఆపేస్తున్నామని ఏఎస్ఐ అధికారులు వెల్లడించారు.
మసీదులో ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ వారణాసి కోర్టు తీర్పు ఇవ్వగా, ఏఎస్ఐ టీం సోమవారం జ్ఞానవాపీ మసీదులో అడుగుపెట్టింది. నాలుగు గంటలపాటు శాస్త్రీయ పరిశోధన సాగిందని, వీడియో రికార్డింగ్ చేస్తున్నామని హిందువుల తరఫు న్యాయవాది సుభాష్ నందన్ చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ మసీదు మేనేజ్మెంట్ కమిటీ ‘అంజుమన్ ఇంతెజామియా’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వే ప్రక్రియ వాయిదా వేయాలని పిటిషన్లో కోరింది.