లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్రను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ వేళ ఆ యాత్రను ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆ రాష్ట్రాన్ని వివరణ కోరింది. యూపీ ప్రభుత్వాన్ని కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. సుమోటోగా సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది. కన్వర్ యాత్రకు మంగళవారం యూపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై స్పందన ఇవ్వాలని కోర్టు కోరింది.
ఏమిటీ కన్వర్ యాత్ర..
బోళాశంకరుడి భక్తులు కన్వర్ యాత్రలో పాల్గొంటారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఆ కార్యక్రమంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ యూపీ ప్రభుత్వం మాత్రం తక్కువ సంఖ్య భక్తులతో వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్టీ పీసీఆర్ నెగటివ్ పత్రం అవసరమని కూడా స్పష్టం చేసింది. ప్రతి ఏడాది శివభక్తులు పవిత్ర కన్వర్ యాత్ర చేపడుతారు. ఉత్తరాఖండ్లోని హిందువుల పుణ్యక్షేత్రాలైన హరిద్వార్, గోముఖ్, గంగోత్రికి భక్తులు వెళ్లి అక్కడ నుంచి గంగానది నీటిని తీసుకువస్తారు. సాధారణంగా యూపీ, బీహార్ ప్రజలు ఈ యాత్రలో పాల్గొంటారు. పవిత్ర గంగాజలాలను తీసుకువచ్చిన ఆ భక్తులు.. స్థానికంగా ఉన్న శివాలయాల్లో ఆ నీటితో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. అయితే ఈసారి ఉత్తరాఖండ్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. పవిత్ర గంగాజలాలను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు ఆ రాష్ట్రం చెప్పింది. కానీ సుప్రీం మాత్రం యూపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది.