Supreme Court : వీధి కుక్కలను పబ్లిక్ ప్లేసెస్ నుంచి తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరించేందుకు నిరాకరించింది. ఈ అంశంపై నవంబర్ 2025లో వెల్లడించిన తీర్పులో మార్పులు చేయబోమని సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎన్వీ అంజారియా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తాజాగా ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది.
వీధి కుక్కల నియంత్రణ విషయంలో గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలను సవరించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. నాటి మార్గదర్శకాలను సవరించలేమని తేల్చిచెప్పింది. అంతేకాదు.. అప్పటి మార్గదర్శకాలు సరిగ్గా అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఏడాది వెల్లడించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. జంతు సంరక్షణ విషయంలో యానిమల్ వెల్ఫేర్ బోర్డు సూచించిన మార్గదర్శకాలను అమలు చేయాలి. హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తరలించాలి.
ఈ సమీప ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉండకుండా చూడాలి. ప్రమాదకరమైన లేదా జబ్బు పడిన కుక్కలను చంపేందుకు కూడా కోర్టు అంగీకరించింది. అవసరమైతే అలాంటి కుక్కల్ని కారుణ్య మరణం కింద చంపొచ్చని సూచించింది. వీధి కుక్కల సంతానాన్ని నియంత్రించాలి. అలాగే, వ్యాక్సినేషన్ నిర్వహించాలి. ఇదే సమయంలో వాటికి అవసరమైన షెల్టర్ సదుపాయాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ప్రతి నగరంలో వీధికుక్కలకు సంబంధించి స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ సెంటర్లు, షెల్టర్లు తప్పనిసరిగా ఉండాలి. వీటి నిర్వహణ బాధ్యతలు చూసే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలి.
వీధి కుక్కలతోపాటు ఇతర పశువుల కోసం గోశాలలు కూడా ఏర్పాటు చేయాలి. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా చూడాలి. వీటి అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు హెచ్చరించింది. వీధి కుక్కలు.. పిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేమని కోర్టు అభిప్రాయపడింది.